హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లక్కం పల్లి సెజ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2008 లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ కు యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.421 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల కోసం సెజ్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఇందులో పసుపు, మొక్కజొన్న,సొయా బీన్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని 2016 లో బీజేపీ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటును వేగంగా ముందుకు తీసుకెళతామని ప్రభుత్వం మాట ఇచ్చిందని పేర్కొన్నారు. ఓ తెలంగాణ పారిశ్రామిక వేత్త దీన్ని నడిపేందుకు ముందుకు వచ్చినా సీఎం అందుబాటులోకి రాలేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు పెట్టుబడులు లేకుండా వాటాలివ్వాలని బెదిరించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరించారన్నారు. టీఎస్ఐఐసీ నుంచి ఇక్కడ ఒక సూపర్ వైజర్ ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవన్నారు. జోనల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు.
నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదన్నారు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదన్నారు. అభివృద్ది కనిపించడం లేదని తెలిపారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు 30 శాతం కప్పం కట్టాల్సిందే అని హుకుం జారీ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డిని ఈ ప్రాంత రైతులు ఓడించాలని పిలుపునిచ్చారు.