బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో విషాదం నెలకొంది. శనివారం జగిత్యాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొనాల్సి ఉంది. అయితే ఈలోపే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సంబరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డ్యాన్స్ చేస్తూ బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ కుప్పకూలిపోయాడు.
దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. నరేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నరేందర్ మృతితో ఆత్మీయ సమ్మేళనం రద్దు చేశారు. శనివారం జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ శ్రేణులు అంతా సిద్ధం చేశారు.
శనివారం మధ్యాహ్నం ఆత్మీయ సమ్మేళనం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారు రజిని భర్త నరేందర్ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అయితే ఉన్నట్టుండి నరేందర్ తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయాడు.
వెంటనే స్పందించిన బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన నరేందర్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఇలాంటి ఘటన జరగడంతో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. విషయం తెలిసిన ఎమ్మెల్సీ కవిత.. జగిత్యాల పర్యటనను రద్దు చేసుకున్నారు.