రేవంత్ రెడ్డి బలుపుతో మాట్లాడుతున్నాడని తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ మాలోత్ కవిత. శనివారం అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. తనపై, తన తండ్రిపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు. మహబూబాబాద్ లో రేవంత్ రెడ్డి విమర్శలు చేయాలంటే మేము తప్ప ఎవరూ కనిపించడం లేదంటూ మండిపడ్డారు. మా నాన్న నిజాయితీగా రాజకీయాలు చేశారన్నారు. అందుకే జనరల్ స్థానంలో 7 సార్లు గెలిచారన్నారు.
అవినీతి, అక్రమాలు చేయడం మా కుటుంబంలోనే లేదని, మేము అవినీతికే పాల్పడితే ప్రజలు ఇన్నిసార్లు గెలిపించరన్నారు. విమర్శల్లో కూడా వాస్తవం ఉండాలన్నారు. 2009లో ఎమ్మెల్యే సీటు కోసం చూశానని.. కానీ కేసీఆర్ ఎంపీకి పోటీ చేయాలని సూచిస్తే ఎంపీకే పోటీ దిగానని, ఇప్పుడు కూడా కేసీఆర్ ఎలా చెప్తే అలానే చేస్తానన్నారు. ఎమ్మెల్యే హరిప్రియకు తన మద్దతు ఉంటుందన్నారు ఎంపీ మాలోత్ కవిత.
కాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రెడ్యా నాయక్ సైతం రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ లో తనకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే రేవంత్ చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు.
‘హాథ్ సే హాథ్’ జోడో పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మాలోత్ కవితతో పాటు, ఆమె తండ్రి రెడ్యా నాయక్ పై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ మియాపూర్ లోని కోట్ల విలువ కలిగిన 5 ఎకరాల భూమి ఎంపీ కవితకు ఎలా వచ్చిందన్నారు. ఈ భూమి కోసమే రెడ్యా నాయక్ కాంగ్రెస్ ను వీడారన్నారు.