– ఏపీలో బీఆర్ఎస్ భవితవ్యంపై సర్వే
– ఐప్యాక్ టీంను రంగంలోకి దింపిన కేసీఆర్
– బార్డర్ నియోజకవర్గాలపైనే గురి
– 20-25 సీట్లకు స్కెచ్
– 6 శాతం ఓటు బ్యాంక్ కోసం కసరత్తు
ఏపిలో బీఆర్ఎస్ పోటీచేయడం వల్ల ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటీ..అసెంబ్లీ సీట్లు కానీ, లోక్ సభ సీట్లు కానీ గెలవడానికి ఏ మేరకు అవకాశాలున్నాయి..ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు.. కేంద్రంలో ప్రధాని మోడీ పై కేసీఆర్ చేస్తున్న పోరాటాల గురించి ఆంధ్రులు ఏమనుకుంటున్నారు..ఏపీలో వైసీపీ పాలనకు,తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు మధ్య తేడాను ఆంధ్రులు గమనిస్తున్నారా.. అన్నది బీఆర్ఎస్ బాస్ తెలుసుకోవాలనుకుంటున్నారు.
అంతే కాదు ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును వాళ్లు తెలుసుకున్నారా.. బీఆర్ఎస్ విస్తరణను స్వాగతిస్తున్నారా.. ఇవన్నీ బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తెలుసుకోవడానికి సర్వే నిర్వహింపచేస్తున్నారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులైన తర్వాత ఆ పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరిగింది. పార్టీ అధినేత కేసీఆర్ ఇస్తున్న సూచనలు, సలహాల మేరకే వీరు పనిచేస్తున్నారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేయాల్సిన ఐప్యాక్ కొంత కాలం క్రితం తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోయింది. అందులోని కొన్ని బృందాలు ఏపీలో జగన్ కోసం పనిచేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా ఐప్యాక్ సేవలను వాడుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో సర్వేలు జరుగుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఈ సర్వే నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఏపీలో పోటీ చేయబోయే నియోజకవర్గాలను గుర్తించే బాధ్యతను కూడా అప్పజెప్పారు.
అయితే తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ గురిపెట్టారు. వీటిల్లో విజయావకాశాలుంటాయనేది ఆయన ఆలోచన. అందుకనుగుణంగా కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో కూడా సర్వే జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలకు పోటీ చేయడం కన్నా తనకు అనువుగా ఉన్న సీట్లలో పోటీ చేసి విజయావకాశాలను పెంచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఎన్నికలు జరిగే చివరి నిముషాల్లోనే వీటిని ప్రకటించబోతున్నారు. అప్పటి వరకు బయటకు వెల్లడి చేయరని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 20 నుంచి 25 నియోజక వర్గాల్లో పోటీపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ సీట్లు గెలుచు కోవడం కన్నా గణనీయ సంఖ్యలో ఓట్లను సాధించగలిగితే రాజకీయ ప్రయోజనం సిద్ధిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. జాతీయ పార్టీ ద్వారా తనకు రావల్సిన 6 శాతం ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. కనీసం 3 అసెంబ్లీ నియోజక వర్గాలనైనా గెలుచుకోగలిగితే జాతీయ ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీకి బూస్ట్ వచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. దీని కోసం ఇప్పటి నుంచే సర్వేను చేయిస్తున్నారు.