– ప్రభుత్వ పిటిషన్ చుట్టూ మాటల యుద్ధం
– దుమారం రేపుతున్న గవర్నర్ ట్వీట్
– ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరని చురకలు
– తమిళిసై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల కౌంటర్
– పైరవీలకు రాజ్ భవన్ కేంద్రమైందన్న మంత్రి
– బీఆర్ఎస్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్
ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే అధికార పక్షం, ప్రతి పక్షాలకు మధ్య ఈ హీట్ ఉంటే..ఇంతలా ఆసక్తి రేగేది కాదు. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ గా మొదలైన పోరు కాస్త ఇప్పుడు రాజ్ భవన్ సెంట్రిక్ గా బీఆర్ఎస్, బీజేపీగా మారి మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది.
తాజాగా పెండింగ్ బిల్లుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా దానిపై గవర్నర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉందని, సీఎస్ శాంతి కుమారి బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం మర్యాదగా వచ్చి తనను కలువలేదని, కర్టసీగా ఫోన్ కూడా చేయలేదని.. రాజ్ భవన్ కు వచ్చేందుకు టైమ్ లేదా అని తమిళి సై సీఎస్ కు ట్వీట్ ద్వారా చురకలంటించారు.
గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ స్పందిస్తూ రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళి సై, సీఎస్ శాంతి కుమారి,డీజీపీ అంజనీకుమార్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ..” సీఎస్ మేడమ్ మీకు కవల సోదరి ఉందా ఈ ఫోటోలో అలా కనిపిస్తోందా.. గౌరవనీయులైన గవర్నర్ మీరు అధికారికంగా ఎప్పుడు రాజ్ భవన్ కు రాలేదని ఆరోపిస్తున్నారు..” అంటూ ట్వీట్ చేశారు.
మరికొందరేమో గవర్నర్ ఈ ట్వీట్ చేసినంత టైమ్ లో పెండింగ్ బిల్లులపై సంతకాలు పూర్తయ్యేవని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు గవర్నర్ ట్వీట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ట్రోల్స్ పై బీజేపీ మద్దతు దారులు సైతం కౌంటర్ వేస్తున్నారు. గవర్నర్ చేస్తున్న వ్యాఖ్యల్లో తప్పేముందని అంటున్నారు.
రిపబ్లిక్ డే వేడుకలకు సీఎస్ రాజ్ భవన్ కు వెళ్లిన తను స్వయంగా వెళ్లలేదని హైకోర్టు ఆదేశాలతోనే అక్కడికి వెళ్లిందని మీ లాంటి మందబుద్ధులకు ఆ విషయం ఎట్లా తెలుస్తుందంటూ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. రిపబ్లిక్ డే ఈవెంట్ అనంతరం లేదా అంతకు ముందు అసలు సీఎస్ ఎన్ని సార్లు రాజ్ భవన్ కు వచ్చారని నిలదీస్తున్నారు. తెలంగాణ ఫస్ట్ సిటిజన్ పై ఈ తరహా ఎటాక్ ఆపాలని కోరుతున్నారు. మొత్తానికి ఎటాక్, కౌంటర్ ఎటాక్ లతో గవర్నర్ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతోంది.
ఇక ఇలా ఉంటే.. గవర్నర్ పై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదన్నారు. తెలంగాణ బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా, పెండింగ్ లో పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు పోతుందని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే గవర్నర్ తెలంగాణ బిల్లులపై సంతకం పెట్టలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గవర్నర్ తమిళి సై కుట్రలు చేస్తుందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.