డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల గోడును పట్టించుకోనే నాథుడే లేడని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ మండిపడ్డారు. వంగూరు మండలం డిండి చింతపల్లి గ్రామానికి చెందిన తుమ్మల రజిత రిజర్వాయర్ కాల్వ నిర్మాణంలో 4 ఎకరాల వ్యవసాయ భూమిని కోల్పోయి, మానసిక క్షోభకు గురై పది రోజుల క్రితం మరణించింది. భూమి కోల్పోయిన స్థలంలోనే టెంట్ వేసుకుని తాత్కాలికంగా నివాసముంటూ, న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఆమె కూతురు ప్రగతిని కలిసి పరామర్శించారాయన. నిర్వాసితులు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని, చలికి వణుకుతూ అక్కడే ఉంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వేలాది మంది రైతులకు ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారం అందడం లేదన్నారు ఆర్ఎస్పీ. చివరకు రైతుబంధు సహాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా స్థానిక ఎమ్మెల్యే పోలీసుల సహాయంతో బెదిరింపులకు దిగడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్న ఆయన.. నిజంగా పేదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రేమ ఉంటే తక్షణమే స్పందించి మార్కెట్ ధరలకు అనుగుణంగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి డిండి రిజర్వాయర్ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు ఆర్ ప్రవీణ్.