ఓ భవన నిర్మాణదారుడి నిర్లక్ష్యం చిన్నారిని బలితీసుకుంది. భవనంపై నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ గోడ కూలి చిన్నారి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గుంటూరుకు చెందిన సునీల్ హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని.. శాతవాహన నగర్ లో నివాసం ఉంటూ.. బేకరి నడిపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం బేకరీకి వెళ్లాడు సునీల్.
అతనికి టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు అతని భార్య మేరీ, నాలుగేళ్ల కూతురితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఆ పక్కనే భవనంపై నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ గోడ కూలి.. ఆ ఇటుకలు రోడ్డుపై వెళ్తున్న వారిపై పడ్డాయి.
దీంతో చిన్నారి దీత్య తలపై పెద్ద ఇటుక పడటంతో తలకు తీవ్రగాయాలై.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భవన నిర్మాణం చేస్తున్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు చెప్తున్నారు.