కరోనా తర్వాత హైదరాబాద్ లో మెట్రో సేవలు పుంజుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు మెట్రో అధికారులు. సెలవు రోజుల్లో వినియోగించుకునేలా సూపర్ సేవర్ కార్డును ప్రారంభించారు. 59 రూపాయలతో రోజంతా మెట్రో రైల్లో తిరిగే అవకాశాన్ని కల్పించారు.
ఈ ఆఫర్ 100 రోజుల పాటు ఉంటోందని.. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి తెలిపారు. అందులో భాగంగా ఐదుగురు మెట్రో ప్రయాణికులను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి సువర్ణ ఆఫర్ విజేతలుగా ప్రకటించి.. బహుమతులు అందజేశారు.
కాగా.. తొలుత ఈ సూపర్ సేవర్ కార్డును రూ.50తో కొనుగోలు చేయాలని.. ప్రతీసారి అదే కార్డులో రీఛార్జి చేసుకోవాలని అన్నారు. మెట్రో ప్రకటించిన 100 సెలవు రోజుల్లో మాత్రమే ఈ కార్డు వినియోగంలో ఉంటోందని ఆయన తెలిపారు. అయితే.. సెలవుల్లో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చునని పేర్కొన్నారు.
ఉగాది నుంచి మెట్రోలో సూపర్ సేవర్ కార్డులు విక్రయించనున్నట్లు ఎండీ ప్రకటించారు. ప్రకటించిన సెలవు రోజులు ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారంతో పాటు.. ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగష్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగ రోజుల్లో ఈ కార్డుతో ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు.