వరంగల్ లో యూత్ కాంగ్రెస్ నేతపై దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. వరంగల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని తలచింది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైనా ఆయన కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
రోజురోజుకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్ఎస్ గుండాల దౌర్జన్యాలపై కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేప్టటాలని టీపీసీసీ ఆదేశించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నేడు కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేయాలని.. బీఆర్ఎస్ గుండాల వైఖరిని ఎండగడుతూ మీడియాలో మాట్లాడాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.
అదే విధంగా..వరంగల్ కమిషనరేట్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. అయితే సోమవారం హనుమకొండలో హథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. యాత్రలో హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ పై దాడి జరిగింది.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేను విమర్శిస్తూ కొన్ని కొటేషన్ లతో కూడా ఫ్లెక్సీని పట్టుకొని రేవంత్ రెడ్డి వచ్చే మార్గంలో ఆయన నిల్చున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పవన్ ను వెంబడించి.. పక్కనే ఉన్న గల్లీలోకి తీసుకొనివెళ్లి చితకబాదారు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో రక్తపు మడుగులో ఉన్న పవన్ ను వదిలేసి పారిపోయారు. పవన్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.