తిరుమలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 28వ మలుపు వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది.
తిరుమల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భక్తులతో బయలు దేరిన బస్సు మొదటి ఘాట్ రోడ్డులోని 28వ మలుపు వద్దకు రాగానే డివైడర్ ను ఢీ కొట్టింది.
దీంతో బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకు వెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 45 మంది భక్తులు వున్నారు. అధిక వేగానికి తోడు బస్సు స్టీరింగ్ కూడా లాక్ కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
అదే సమయంలో అటుగా వెళ్తున్న సిబ్బంది ఘటనను చూసి అలర్ట్ అయ్యారు. వెంటనే బస్సు దగ్గరికి పరుగెత్తుకెళ్లారు. ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను పగుల గొట్టి భక్తులను బయటకు లాగారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాద ఘటనపై ఈవో ధర్మారెడ్డి విచారణకు ఆదేశించారు.
ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీతో పాటు ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తున్న ఒలేక్ట్రా కంపెనీ ప్రతినిధులతోనూ ఈవో ధర్మా రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం టీటీడీ వద్ద 10, ఆర్టీసీ వద్ద 65 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్లో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.