మే నాటికి మన బస్తీ- మన బడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో మన బస్తీ- మన బడి పనులపై శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి.. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందజేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. మన బస్తీ- మన బడి పథకం అమలు కోసం 7289 కోట్లు మంజూరు చేశారని మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఈ పథకం మొదటి విడతలో భాగంగా హైదరాబాద్ లోని 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పాఠశాలల అభివృద్ధికి ఇంత మొత్తంలో నిధులు కేటాయించలేదన్నారు. అలాగే బిల్లులు చెల్లించలేదనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, నగర మేయర్ విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.