మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది.అవినాష్ పై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు నిరాకరించింది. తదుపరి సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
వివేకా హత్య కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణ సమయంలో అనుమతించలేమన్న న్యాయస్థానం.. అవినాష్ రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని సీబీఐకి సూచించింది. అయితే అవినాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ చేస్తున్న దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈనెల 9 న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తన విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని, సీబీఐ అధికారులు నమోదు చేసిన తన వాంగ్మూలం ప్రతిని తనకు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా సీబీఐ విచారణ జరుపుతున్న సమయంలో వీడియో, ఆడియో రికార్డింగ్ కూడా చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
అయితే అవినాష్ రెడ్డి అభ్యర్థనపై స్పందించిన సీబీఐ అధికారులు.. ఆడియో,వీడియో రికార్డులు కూడా ఉన్నాయని హైకోర్టుకు వెల్లడించారు. అవినాష్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై ఈ నెల 13న వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ఈరోజుకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై తీర్పు వెల్లడించే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ అధికారులను ఆదేశించింది.
అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే మూడు సార్లు విచారణకు హాజరయ్యారు. ఇక అవినాష్ దాఖలు చేసిన మధ్యంతర ఉత్తర్వులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం..పిటిషన్ ను కొట్టివేస్తూ..సీబీఐని దర్యాప్తు చేసుకోవాలని ఆదేశించింది. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించేందుకు నిరాకరించింది. తదుపరి సీబీఐ విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది.