పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు ఇమ్రాన్ సహా మరో 150 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వారిపై కేసులు పెట్టినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.
గత వారం పాకిస్థాన్ ప్రధాని సౌదీ అరేబియాలోని మదీనాలోని మసీదుకు వెళ్లారు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కొంతమంది షరీఫ్కు వ్యతిరేకంగా దొంగ, ద్రోహీ అంటూ నినాదాలు చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోల ఆధారంగా పంజాబ్ పోలీసులు కేసులు పెట్టారు. ఇందులో మాజీ మంత్రులు ఫవాద్ చౌదరి, షేక్ రషీద్, షహబాజ్ గుల్తో సహా పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. మదీనాలోని ప్రవక్త మసీదును అపవిత్రం చేయడం, గూండాయిజం, ముస్లింల మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో శనివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని 295 ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇమ్రాన్తో సహా 150 మందిపై పంజాబ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం.. మదీనాలోని మస్జిద్ ఏ నబ్వీ వద్ద షరీఫ్, అతని ప్రతినిధి బృందాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ వంద మందికిపైగా మద్దతుదారులను సౌదీ అరేబియాకు పంపించారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, పీటీఐ,ఇతర నామినేటెడ్ నాయకులు ఈ విషయంలో పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫైసలాబాద్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రధాని షరీఫ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు తాను ఎవ్వరిని నినాదాలు చేయమని చెప్పలేదని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.