టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చేయాలని అన్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలు పిలుపునిస్తున్నారు.
ఇది హేయమైన చర్య అంటూ ములుగు బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ములుగు మండలాధ్యక్షుడు బాదం ప్రవీణ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణానికి హాని చేయడం కోసం నక్సల్స్ తో జరిగిన లోపాయికారి ఒప్పందం, కుట్రలో బాగంగా రేవంత్ మాట్లాడారని తమకు అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ బహిరంగ పిలుపు వెనుక మాజీ మావోయిస్టు, స్థానిక ఎమ్మెల్యే సీతక్క మధ్యవర్తిత్వాన్ని నెరపినట్లుగా తాము భావిస్తున్నామని అన్నారు. కావున రేవంత్ రెడ్డి, సీతక్క తదితరులపై కుట్ర కేసు నమోదు చేసి చట్ట ప్రకారం విచారణ జరిపించి ముఖ్యమంత్రికి ఉన్న ప్రాణహానిని తప్పించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు.
రేవంత్ రెడ్డి మీద పీడీ యాక్ట్ నమోదుచేయాలని పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు పిర్యాదు చేశారు. యాత్రను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.