వైఎస్ వివేకా హత్య కేసులో కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ రోజు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి హైదరాబాద్, కోఠిలోని సీబీఐ కార్యాయలంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణకు వచ్చారు.
ఇక 40 కోట్ల డీల్ వ్యవహారంపై అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే అవినాష్ రెడ్డితో పాటు వచ్చిన న్యాయవాదులను సీబీఐ అనుమతిస్తుందా.. లేదా అనే దానిపై సందిగ్థత నెలకొంది. గతంలో విచారణ జరిగినప్పుడు న్యాయవాదులను అనుమతించలేదు.
అయితే వివేకా హత్య కేసులో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తోంది. ఆయనతో పాటు తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయానికి సంబంధించి ఓ అంచనాకు వచ్చింది. విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కోఠిలోని సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. పులివెందుల నుంచి వచ్చిన వైసీపీ వర్గీయులను వెనక్కి పంపిస్తున్నారు. దర్యాప్తు జరిగే పరిసరాల్లో ఆంక్షలుంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఎంపీ రాక సందర్భంగా సీబీఐ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ కేసులో అవినాష్ రెడ్డిని తొలిసారి గత నెల 28వ తేదీన ప్రశ్నించారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా ఈ విచారణ జరిగింది. అవినాశ్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా అప్పట్లో కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.