మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను వేగవంతం చేసింది సీబీఐ. వైకాపా ఎంపీ అవినాష్రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.
అయితే ఈ కేసులో విచారణ నిమిత్తం అవినాష్రెడ్డికి మూడు రోజుల క్రితమే మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. మంగళవారం అంటే ఈనె 24వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల ఆరోజు తాను రాలేననని చెప్పారు ఎంపీ అవినాష్ రెడ్డి. నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా?’ అని మంగళవారం ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో విచారణకు హాజరయ్యేందుకు ఐదు రోజుల సమయం కావాలని ఆయన కోరారు.
దాంతో పాటు తనకు రెండో సారి నోటీసులు వచ్చేవి ఉన్నాయని.. అవి వచ్చిన తరువాత తాను విచారణకు హాజరయ్యే విషయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు రెండోసారి సీబీఐ నోటీసులు జారీ చేస్తూ 28న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఇక దాదాపు రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ.. ఇప్పటివరకూ ఒక్కసారీ ఆయనను ప్రశ్నించలేదు. అయితే కడప నుంచి హైదరాబాద్కు కేసు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. అవినాష్కు నోటీసులివ్వడం చర్చనీయాంశంగా మారింది.
మరో వైపు మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు చేరుకున్నాయి.