టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఉదయం నుండి జరిగిన సీబీఐ సోదాలు ముగిశాయి. గుంటూరు, హైదరాబాద్ నివాసాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. బెంగళూరు నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఏకంగా 7 గంటల పాటు విచారణ కొనసాగించారు.
ట్రాన్స్రాయ్ సంస్థ పలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు ఎగవేత ఆరోపణలున్నాయి. బెంగళూరులోని కెనరా బ్యాంక్ నుండి తీసుకున్న రుణం చెల్లించకపోవటంతో కెనరా బ్యాంకు ఉద్యోగులతో కలిసే సీబీఐ అధికారులు రాయపాటి నివాసాలకు చేరుకున్నారు. ఈ రెండు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలు, ట్రాన్స్ట్రాయ్ సంస్థతో ఉన్న సంబంధాలపై రాయపాటిని సీబీఐ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
దాదాపు ఏడు గంటల పాటు సాగిన ఈ విచారణకు రాయపాటి కుటుంబ సభ్యుల వాదనను సీబీఐ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 8గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు సోదాలు జరిగాయి.