ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిటిషన్ కౌంటర్ దాఖలు చేసి.. వాదనలు వినిపిస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
అయితే ఓఎంసీకి లీజుల కేటాయింపు సమయంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డి.. అవినీతి నిరోధక చట్టం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం. ఇక ఇలా ఉంటే.. తనపై కేసు కొట్టివేయాలని కోరుతూ సబితా ఇంద్రారెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మరోసారి విచారణ చేపట్టారు. మరో వైపు మొదటి రెండు ఛార్జిషీట్లలో సాక్షిగా పేర్కొని.. మూడో అభియోగపత్రంలో సరైన కారణం లేకుండానే నిందితురాలిగా మార్చారని సబితా ఇంద్రారెడ్డి తరపున న్యాయవాది వాదించారు.
కొత్త ఆధారాలు, సాక్షులు లేకుండానే సాక్షి నుంచి నిందితురాలిగా ఎలా మార్చారో సీబీఐ వివరించలేదన్నారు. సీబీఐ కోర్టు కూడా తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇచ్చిందని వాదించారు. అయితే సబితా ఇంద్రారెడ్డి పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలపడంతో విచారణను ఈ నెల 24 కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
ఇక ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీబీఐ కోర్టులో వేసిన డిశ్చార్చ్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. గనుల కేటాయింపు ఫైల్ ను ఆమోదించడం తప్ప.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు.