తినడానికి తిండి ఉన్న లేకున్నా సొంతిల్లు కట్టు కోవాలనే కోరిక లేని వారు ఉండరు. కానీ.. పెరుగుతున్న ధరలతో సామాన్యుడి సొంతింటి కల నేరవేరేలా కనిపించట్లేదు. ఇప్పటికే పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో సిమెంట్ ధరలు పెంచి మూలుగుతున్న గాడిద పైన తాటి పండు పడ్డట్టు చేస్తున్నాయి ప్రభుత్వాలు.
ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30 నుంచి 50 శాతం పెరిగాయి. దీంతో సిమెంట్ ధరలు కూడా భారీగా పెరగొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా బొగ్గు, పెట్కోక్, పెట్రోలియం దిగుమతుల భారం పెరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బస్తా సిమెంట్ బ్రాండ్ ను బట్టి 350 నుంచి 450 రూపాయల వరకు ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు.
మార్చి క్వార్టర్ లో పెట్ కోక్ ధరలు అంతర్జాతీయంగా 43 శాతం పెరిగితే.. దేశీయ పెట్ కోక్ ధరలు మార్చిలో 26 శాతం, ఏప్రిల్లో 21 శాతం మేర పెరిగాయి. దిగుమతి వ్యయం ఏడాది క్రితంతో పోలిస్తే ఒక్కో టన్నుపై 130 డాలర్ల మేర పెరిగింది. ఆస్ట్రేలియాలో వాతావరణం అనుకూలించకపోవడం.. ఇండొనేషియాలో నిషేధం వల్ల బొగ్గు ఎగుమతులు పూర్తిగా తగ్గాయి. దీంతో వాటి ధర పెరిగిందని అంటున్నారు. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 115 డాలర్ల వరకు పెరిగిందంటున్నారు. మరోవైపు ఇండియాలో బల్క్ డీజిల్ లీటర్పై 25 రూపాయలు పెంచారు.
సిమెంట్ రవాణా 50 శాతం వరకు రోడ్లపైనే జరుగుతోందని అంటున్నారు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా రవాణా ఖర్చులు, పెట్కోక్, బొగ్గు ధరల పెరుగుదల కారణంగా ఉత్పత్తి, ప్యాకేజింగ్ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో.. ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ వినియోగం 5-7 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశీయ సిమెంటు వినియోగంలో 60 శాతం ఇళ్ల నిర్మాణానికే వెళ్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ హాఫ్లో సిమెంట్కు 20 శాతం గిరాకీ పెరిగింది. అయితే సెకండాఫ్లో అకాల వర్షాలు, ఇసుక, కూలీల కొరతతో 7 శాతం మేర తగ్గిందని.. నిర్మాణ ఖర్చు భారీగా పెరగడంతో సిమెంట్ గిరాకీ తగ్గొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.