దేశంలో కరోనా పడగ విప్పుతోంది. తాజాగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ మేరకు ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని లేఖలో కోరింది. కరోనా వైరస్ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. గతంలో కొవిడ్ కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని ఇన్ఫెక్షన్ను నివారించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.
జిల్లాల వారీగా పరిస్థితిపై రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, కొవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్ వ్యాక్సినేషన్, వ్యూహాన్ని అనుసరించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.
నాలుగు నెలల తర్వాత దేశంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 754 కొత్త కేసులు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్లో 734 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసులు ఆ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి.
కరోనా బారిన పడి కర్ణాటకలో ఒకరు మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,633 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,92,710కు చేరింది. వైరస్ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది ప్రాణాలు కోల్పోయారు.