జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్టే అని వ్యాఖ్యానించిన వైసీపి రెబల్ ఎంపీ చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పి ఆశ్చర్యపర్చారు. ఏపి రాజధాని అమరావతేనని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. విశాఖ రాజధాని అంటున్న సీఎం జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని ఎద్దేవా చేశారు.
కావాలనుకుంటే జగన్ విశాఖకు వెళ్లొచ్చని..అవసరం లేని వారు కోటలో ఉన్నా..పేటలో ఉన్నా ఒకటేనని అన్నారు. రాజధాని అమరావతి అని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. ఈ ప్రశ్న అడిగిన విజయసాయిరెడ్డికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. విభజన చట్టం ప్రకారం రాజధానిగా అమరావతి ఏర్పాటయిందని..ఇప్పుడు విశాఖను రాజధానిగా మార్చాలంటే పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని చెప్పారు.
సీఐడీ పోలీసులు జగన్ డైరెక్షన్ లో తనను దారుణంగా హింసించిన అంశంలో రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు తనకు న్యాయం చేసిందని ఆయన అన్నారు. తనను హింసించిన వారికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. తన ప్రాణాలకు ప్రతిపక్ష నేతలు అండగా ఉన్నారని… ముఖ్యంగా తనకు అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మాజీ సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారని, అక్కడ గోల్ఫ్ ఆడుకుంటున్నారని చెప్పారు.