రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పారా బాయిల్డ్ రైస్ సేకరణలో తెలంగాణ రైతులకు మరోసారి మద్దతుగా నిలిచింది కేంద్రం. 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది. తాజాగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి మరో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరిస్తామని వెల్లడించింది.
తెలంగాణ రైతులకు మద్దతునందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు కొంత ఊరటనిస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి, త్వరగా మిల్లింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చిన గడువు లోపు ఎఫ్ సీఐకి బియ్యాన్ని అందజేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని సూచించారు కిషన్ రెడ్డి.
పారాబాయిల్డ్ రైస్ సేకరణ కోసం గత నెలలో కేంద్రమంత్రి ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాసినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ నుంచి 15 లక్షల మెట్రికల్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.