తక్కువ వడ్డీ రేట్లు, పుష్కలమైన ద్రవ్య లభ్యత. కరోనా మహమ్మారి తీసుకొచ్చిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లూ ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరించిన విధానం. కానీ.. కరోనా దెబ్బ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటుండడం.. ద్రవ్యోల్బణం నియంత్రణ దాటి పోతుండడంతో కేంద్ర బ్యాంకులు సమీక్షలో పడ్డాయి. కీలకమైన రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ కూడా రెపో రేటును అత్యంత కనిష్ట స్థాయి 4 శాతానికి తీసుకొచ్చింది. రెండేళ్లుగా కనిష్ట స్థాయిలోనే ఇది కొనసాగుతోంది. మన దగ్గర ద్రవ్యోల్బణం గరిష్టాలకు చేరినప్పటికీ.. ఇంకా పరిమతి దాటిపోలేదు. కానీ.. అమెరికా తదితర పాశ్చాత్య దేశాల్లో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంది. అమెరికాలో ఇప్పటికే 7 శాతం దాటిపోయింది. కనుక కేంద్ర బ్యాంకులు రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయనున్నాయి. ఆర్బీఐ కూడా ఏప్రిల్ సమీక్ష నుంచి రేట్లను పెంచొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మార్చి నుంచి రేట్లను పెంచుతున్నట్టు ఇప్పటికే సంకేతం ఇచ్చింది. బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే రేట్లను పెంచేసింది. మరింత దూకుడుగా రేట్ల పెంపు ఉండాలన్న వాదన.. బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ కమిటీలోనే వ్యక్తమవుతోంది. బ్యాంక్ ఆఫ్ కెనడా వచ్చే నెల నుంచి రేట్లను పెంచబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ఈ ఏడాది చివరికి రేట్లను పెంచొచ్చని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
గతవారం బ్రెజిల్ వరుసగా మూడో విడత రేట్లను పెంచింది. చెక్ రిపబ్లిక్ అయితే.. ఈయూ జోన్ లోనే అత్యంత గరిష్టానికి రేట్లను చేర్చింది. రేట్లను తగ్గించడం వల్ల వ్యవస్థలోకి ఎక్కువ ద్రవ్యలభ్యత వస్తుంది. వడ్డీ భారం తక్కువ కనుక రుణాలకు డిమాండ్ పెరుగుతోందరి చెప్తున్నారు. అయితే.. పరిస్థితులు మెరుగుపడుతుంటే ఇదే అధిక ద్రవ్య లభ్యత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా వృద్ధికి ప్రతికూలంగా మారుతుందని.. కేంద్ర బ్యాంకులకు దీన్ని బ్యాలన్స్ చేయడం ప్రస్తుత కర్తవ్యంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.