ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలోని అంశాలను చర్చించేందుకు కేంద్రం నియమించిన కమిటీ సమావేశం నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్, తెలంగాణ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, ఏపీ ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ వర్చువల్ గా భేటీ కానున్నారు.
అందులో ప్రధానంగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల సెటిల్ మెంట్, పన్నుల విషయంలో తలెత్తిన వివాదాల పరిష్కారం, బ్యాంకుల్లో ఉన్న నగదు డిపాజిట్ల విభజనతో పాటు.. క్యాష్ క్రెడిట్ అంశాలపై చర్చించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
అందులో ముందుగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. మొత్తం 9 అంశాలను పెట్టారు. దాంతో ప్రత్యేకహోదా అంశం తెరపైకి వచ్చింది. కానీ.. వెంటనే అందులో నుంచి హోదా పాయింట్ తో పాటు.. పన్ను రాయితీ లాంటి నాలుగు అంశాలను తొలగించింది. ఎజెండాలో మార్పు చేస్తూ కేంద్ర హోంశాఖ మరో సర్క్యులర్ జారీ చేసింది.
దీంతో ఇది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఏళ్లు గడుస్తున్నా.. కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమావేశంలో అయినా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్థి తగాదలు ఓ కొలిక్కి వచ్చేనా అనే చర్చ నడుస్తోంది.