టీవీ ఛానల్స్ చేస్తున్న వార్తా ప్రసారాల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంచలనం పేరుతో ఇష్టానుసారంగా వార్తా కథనాలు ప్రసారం చేయోద్దంటూ ఛానల్స్కి సూచించింది. ప్రసారం చేసే అంశాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించింది. కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అందుకు సంబంధించి ఓ అడ్వైజరీని విడుదల చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఢిల్లీ జహంగీర్పురి హింసాకాండకు సంబంధించిన వార్తల విషయంలో టీవీ ఛానళ్లు వ్యవహరించిన తీరును ప్రస్తావించింది. ఏదైనా వార్తను టెలికాస్ట్ చేసే ముందు ప్రతి విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించింది. యుద్ద పరిణామాలపై అతిశయోక్తితో కూడిన కథనాలను, వివాదాస్పదమైన హెడ్డింగ్ లతో వార్త కథనాలను సృష్టించిన విషయంలో కేంద్రం సీరియస్ అయింది.
అలాగే ఢిల్లీ జహంగీర్పురి ఘర్షణలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మీడియా ఛానెల్స్ ప్రసారం చేసే కథనాలపై కేంద్రం స్పందించింది. దర్యాప్తునకు ఇబ్బంది కలిగించిందని అభిప్రాయపడింది. జర్నలిస్టులు నిరాధారమైన మరియు కల్పిత వాదనలు చేస్తూ ప్రేక్షకులను ప్రేరేపించడానికి అతిశయోక్తిని ఉపయోగిస్తున్నారని మంత్రిత్వ శాఖ విమర్శలు చేసింది. అలాగే టీవీ ఛానెల్స్లో డిబేట్స్ సందర్భంగా ఉపయోగించే భాష, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, సమాజం అంగీకరించలేని విధంగా ఉన్నాయని కేంద్రం వ్యాఖ్యానించింది.
టీవీ ఛానల్స్ కచ్చితంగా కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం 1995 ప్రకారం నడుచుకోవాలని సూచిస్తూ.. కొన్ని నిబంధనలను విడుదల చేసింది.
– కుల, మతాలను రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసారాలు ఉండకూడదు.
– ఇతరుల పరువు, ప్రతిష్టలను దెబ్బతిసేలా.. ఉద్దేశపూర్వక వార్తలు వేయకూడదు.
– తొందరపాటులో ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. వాటిని వెంటనే ప్రసారం చేయకూడదు.
– తప్పుడు వార్తలను, అశ్లీల కథనాలను ప్రసారం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులపై పుకార్లను ప్రసారం చేయకూడదు.
– అసత్యాలను ప్రసారం చేసి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దు.
– సీసీ పుటేజీలతో రెచ్చగొట్టేలా పదే పదే ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలి.
– కథనాలను సగం చెప్పి.. వీక్షకులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు.
– ఒకరి మనోభావాలను దెబ్బతీసేలా కథనాలు ఉండకూడదు.
అంటూ నిబంధనలతో కూడిన అడ్వైజరీని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.