దేశంలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జోన్లలో అనుసరించాల్సిన విధివిధానాలపైనా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ..రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎంలు చేసిన ఫిర్యాదుతో ఈ వెసులుబాటు కల్పించింది.
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్రాలు కఠినంగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది.
కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని కేంద్రం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది.