కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోకాలికి గాయమైంది. గతంలో కిషన్ రెడ్డి మడమకు దెబ్బ తగిలి గాయమైంది. ఇప్పుడు ఆ గాయం మళ్లీ తిరగబెట్టింది. ఈ మధ్య కాలి నొప్పి ఎక్కువగా ఉండటంతో… గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎక్స్రే అనంతరం కిషన్రెడ్డి మడమ వద్ద ఎముకలో పగుళ్లు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వెంటనే వైద్యులు కాలు మడమ వద్ద పట్టీ కట్టారు. ప్రస్తుతం కిషన్రెడ్డి ఢిల్లీలో ఉన్నారు.
అంతకుముందు రెండు రోజుల క్రితమే మునుగోడులో బీజేపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్రెడ్డి. భారీగా తరలివచ్చిన అగ్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కు ర్యాలీగా బయలుదేరారు. బంగారి గడ్డ నుంచి ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్రావు, వెంకటస్వామి, మనోహర్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి ఉన్నారు.
అయితే 15వ తేదీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పూర్తి స్థాయిలో మునుగోడు ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రచారం గడువు ముగిసే వరకు బీజేపీ కీలక నేతలంతా మునుగోడులోనే మకాం వేయనున్నారు. ఇప్పుడు కిషన్రెడ్డి కాలికి గాయం కావడంతో ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
కాగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ నేతలు తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. పోలింగ్ తేదీ అయిన నవంబర్ 3 నాటికి ప్రతి ఇంటికీ కనీసం 3 లేదా 4 సార్లు వెళ్లి ప్రతీ ఓటరును కలిసి బీజేపీకే ఓటేసేలా ప్రచారం చేయాలని ప్రణాళికలు రచించారు. హుజురాబాద్లో తెలంగాణ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లే ఇక్కడ కూడా పాల్గొనే అవకాశాలున్న నేపథ్యంలో శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నాయకత్వం నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.