తెలంగాణలో కొత్తగా నిర్మించాలనుకుంటున్న ఎయిర్పోర్టులపై కేంద్రం కీలక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఆయా ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీపై తుది రిపోర్టులను పంపింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆరు ఎయిర్పోర్టుల్లో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్ పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని నివేదికలో ఎయిర్పోర్ట్ అథారిటీ తేల్చింది. మిగిలిన మూడు అందుకు అనుకూలంగా లేవని స్పష్టం చేసింది.
తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఎయిర్పోర్ట్ అథారిటీ.. ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేసింది. ఈ మేరకు 3 మాత్రమే అన్ని రకాల తగిన విధంగా ఉన్నాయని తమ నివేదికలో వెల్లడించింది. వివిధ దఫాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేసిన కేంద్ర బృందాలు… వరంగల్లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్లోని జక్రాన్పల్లి మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి.
భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్ నగర్లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్ ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు.. ముఖ్యంగా పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని కేంద్ర బృందాలు స్పష్టం చేశాయి.