-చల్లా వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి
పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలదోపిడీని అరికట్టడంలో, సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో తెరాస ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెరాస నాయకులకు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే అసంబద్ధ, అవాస్తవ వాదన ముందుకు తెస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే చిత్తశుద్ధి నిజంగా ఉంటే, బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని…, తేది, సమయం, స్థలం ఎప్పుడైనా, ఎక్కడైనా, ప్రత్యక్షంగా ఐనా, కోవిడ్ వల్ల వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా అయినా తాను సిద్ధం అని సవాల్ చేశారు. మీ ఇష్ట ప్రకారం ఒక సీనియర్ పాత్రికేయుడిని సమన్వయకర్తగా, మీ వెసలుబాటును బట్టి బట్టి తేది, సమయం, స్థలం తెలియజేయగలరని కోరారు.
నిజంగా ప్రభుత్వానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అడ్డుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టు లాంటి ఈ పనులకు టెండర్లు దాఖలు చేసే ప్రతీ కాంట్రాక్టరుని తెలంగాణలో బ్లాక్ లిస్ట్ చేయడమెగాక, గతంలో కేటాయించిన పనులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో విఫలమైతే, ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్.ఎల్.పి) కాదని, కేవలం అప్లికేషన్ ఫర్ డైరెక్షన్స్ (ఆదేశాల కోసం దరఖాస్తు) అని, ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టర్లకు అనుకూలంగా చేస్తూ నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.
బహిరంగ చర్చ సందర్భంగా, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కాకుండా కాంట్రాక్టర్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తీరుని బహిర్గతంచేసి, తెరాస ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు