ట్రాఫిక్ పోలీసులు వేసిన చలాన్లు కట్టలేకపోవడం, దాంతో వారు బైక్ను స్వాధీనం చేసుకోడంతో మనస్తాపానికి గురైన ఓ హమాలీ అత్మహత్యకు పాల్పడ్డాడు. మీర్చౌక్ ట్రాఫిక్ ఎస్సై గణేశ్ వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని మృతుడు సూసైడ్ నోట్ రాశాడు. కూలీ పనులు చేసుకుని బతుకుతున్న తాము అప్పు చేసి బైక్ కొన్నామని, రూ.10 వేలు చలాన్లు రాస్తే ఎలా చెల్లించగలమని, దయతో అలోచించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు సూసైడ్ నోట్లో విజ్ఞప్తి చేశాడు.
నల్లగొండ జిల్లా నేరడిగొమ్ము గ్రామానికి అన్నెపాక ఎల్లయ్య (52), మల్లమ్మ దంపతులు బతుకుతెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ (చింతల్ బస్తీ)లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎల్లయ్య హమాలీగా, మల్లమ్మ చంపాపేటలోని సాయిబాబా గుడిలో పనిచేస్తున్నారు.
పలు చలాన్లు పెండింగ్లో ఉండడంతో మీర్చౌక్ పోలీసులు ఎల్లయ్య బైక్ను సీజ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంటికి వచ్చి విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే డీఆర్డీఓ ఒవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
చలాన్ల సొమ్ము రూ.10 వేలు కడితేనే బండి ఇస్తానని ట్రాఫిక్ ఎస్సై చెప్పాడని, కూలీ పనులు చేసుకునే తనకు అంత సొమ్ము చెల్లించలేనని ఎంత బతిమాలినా వినలేదని, పైగా టార్చర్ పెట్టాడని సూసైడ్ నోట్లో రాశాడు. విచ్చలవిడిగా వేస్తున్న చలాన్లతో పేదలు నానా అవస్థలు పడుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేసీఆర్, కేటీఆర్కు విజ్ఞప్తి చేశాడు.
సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ముందు ఘటన వివరాలను గోప్యంగా ఉంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదట కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపిన పోలీసులు, సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో కేసును మార్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఎల్లయ్య మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య అతని స్వగ్రామానికి తరలించారు. ట్రాఫిక్ ఎస్సై గణేశ్ను సస్పెండ్ చేయాలని బీఎస్పీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ అలుగోలు రమేష్ డిమాండ్ చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని సైదాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.