ఓబుళాపురం గనుల కేసు నుంచి తప్పించాలని హైకోర్టులో మంత్రి సబిత పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జి పిటిషన్ ను ఇటీవలే సీబీఐ కోర్టు కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. నేడు హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్ ను హైకోర్టులో వేసి.. సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణపై ఆమె స్టే కోరారు.
ఇక ఓఎంసీ పరిణామ క్రమం విషయానికొస్తే.. ఓఎంసీ ఫిర్యాదులు రావడంతో 2009 ఏప్రిల్ లో కేంద్ర పర్యావరణ ,అటవీశాఖ, లీజు ప్రాంతాల సరిహద్దులు నిర్ణయించే వరకు తవ్వకాలు నిలిపివేశారు. ఓఎంసీ అతిక్రమణలకు పాల్పడిందన్న ఆరోపణల్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. దీంతో అటవీశాఖ తన ఉత్తర్వుల అమలు నిలిపివేసింది. 2009 మే లో స్థానిక మైనింగ్ వ్యాపారి ఒకరు ఓఎంసీ అక్రమాలపై సుప్రీంను ఆశ్రయించారు.
లీజులను సస్పెండ్ చేయాలని, సరిహద్దులు గుర్తించాలని, దీనికి అయ్యే వ్యయాన్ని రికరీ చేయాలని 2009, నవంబరులో సీఈసీ సిఫార్సు చేసింది. తర్వాత రాష్ట్ర కమిటీ సైతం పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసింది. 2009 డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మరో వైపు ఓఎంసీ హైకోర్టును ఆశ్రయించగా, మైనింగ్ కార్యకలాపాలను నిలిపేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టను ఆశ్రయించగా హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
దీంతో 2010 ఫిబ్రవరిలో మైనింగ్ నిలిపేస్తూ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు రద్దుచేసింది. 2011-13 లో కర్ణాటకలోని బళ్లారి పరిధిలో కూడా మైనింగ్ నిలిపేయాలని ఆదేశించింది. కర్ణాటక మైనింగ్ లీజులపై కూడా సీఈసీ పలు నివేదికలు అందజేసింది. ఏపీ,కర్ణాటక సరిహద్దులను నిర్ణయించేందుకు 12 వారాల గడువు నిర్ణయిస్తూ సుప్రీం కోర్టు 2017 డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయకపోవడంపై 2018 లో 2 రాష్ట్రాలను సుప్రీం మందలించింది.