వైసీపీ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు.
సీఎం జగన్ రెడ్డి నిర్ణయాలతో నష్టపోని వర్గం అంటూ లేదు.
స్థానిక సమస్యలపై టీడీపీ స్థానిక నాయకత్వం పోరాటాలు పెంచాలి.
ఎన్టీఆర్ ట్రస్ట్ సమన్వయంతో కోవిడ్ బాదితులను ఆదుకోండి.
పార్టీ నేతల ఆన్లైన్ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు.
వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. ప్రభుత్వ పాలసీలు, పన్నులు, అధికారిక దోపిడీలతో ప్రతీ ఒక్కరి జీవితాన్ని జగన్ ప్రభుత్వం దారుణంగా ప్రభావితం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని వర్గాలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నాయని.. రానున్న రోజుల్లో ప్రజలు కూడా స్వచ్చంధంగా తిరగబడే పరిస్థితి వస్తుందని అన్నారు. స్థానికంగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల దోపిడీ తీవ్రంగా ఉందని.. వాటిపై మండల, నియోజవర్గ స్థాయి నుంచి నేతలు పోరాటాలు చెయ్యాలని పిలుపు నిచ్చారు.
మండల, నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ సంస్థాగత అంశాలపైనా చంద్రబాబు చర్చించారు. ఇప్పటికీ కొన్ని చోట్ల పెండింగ్ లో ఉన్న గ్రామ, మండల స్థాయి కమిటీల నియామకం పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లు చేర్పించడం, ఒక కుటుంబంలోని ఓట్లను వేరు వేరు డివిజన్లకు మార్చడం వంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కొన్ని చోట్ల అనుకున్నంత ధాటిగా పోరాటాలు జరగడం లేదని.. అలాంటి చోట్ల నేతలు తమ పని తీరు మార్చుకొని.. పార్టీ అభ్యున్నతికి సైనికుల్లా పని చేయాలని చంద్రబాబు కోరారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై తన వద్ద పూర్తి సమాచారం ఉందని.. టీడీపీ మరింత దూకుడుగా వెళ్లాలని ఆయా వర్గాలు కోరుతున్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి దారుణ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వారికి కూడా క్లారిటీ వచ్చిందని అన్నారు. తమ కష్టాలు పోవాలంటే తెలుగు దేశం ప్రభుత్వం రావాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒక రాజకీయ పార్టీగా నిత్యం ప్రజా సమస్యలపై పారాటాలు చేస్తూనే ఉండాలని చంద్రబాబు దిశానిర్థేశం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని.. వారి పోరాటాలకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. మనకు ఓటు వేశారా లేదా అనేది ఎప్పుడూ చర్చ కాదని.. బాధిత వర్గం ఎక్కడ ఉన్నా టీడీపీ వారికి అండగా ఉంటుందనే పార్టీ సిద్దాంతమే ముఖ్యం అని నేతలకు గర్తుచేశారు. జీతాలు పెంచమని అడిగిన పాపానికి..ఉన్న జీతాలను తగ్గించిన ప్రభుత్వం వైసీపీ మాత్రమే అని చంద్రబాబు విమర్శించారు. రోడ్ల గుంతలను పూడ్చలేని జగన్.. జిల్లా కో విమానాశ్రయం కడతా అని చెప్తుంటే నవ్వొస్తుందని అన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు ఎంత ముఖ్యమో.. వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కూడా అంతే ముఖ్యమని అన్నారు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కోవిడ్ రోగులకు మళ్లీ ఉచిత సేవలు మొదలు పెట్టినట్లు ఆయన తెలిపారు. ట్రస్ట్ సౌజన్యంతో రోజూ అందుతున్న టెలిమెడిసిన్ సేవలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మండల, పార్టీ విభాగాలతో సమన్వయం చేసుకుని.. కోవిడ్ రో గులకు వైద్య పరంగా సహాయం చెయ్యాలని కోరారు. ప్రభుత్వం చెయ్యలేని పనిని.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సాయంతో పాటు.. మందుల పంపిణీ కూడా చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. గత కోవిడ్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసిన పలువురు నేతలు.. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు.
జూమ్ కాల్ ద్వారా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో.. మీరు ఎలా ఉన్నారంటూ నేతలు చంద్రబాబును అడిగారు. కోవిడ్ నుంచి వెంటనే కోలుకున్నానని.. తాను పర్ఫెక్ట్ గా ఉన్నానని తెలిపారు. రెండో రోజు నుంచే యథావిధిగా ఆన్లైన్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాని వారికి బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.