తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయామన్నారు. ఈసారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమించనున్నట్టు వెల్లడించారు.
ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు. సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ ఛార్జ్ లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు.
ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందని చెప్పారు. ప్రతి కుటుంబానికీ న్యాయం చేసేందుకు ఈ విభాగం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు.