టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయ దశమి సందర్భంగా భార్య భువనేశ్వరితో కలిసి ఆలయానికి వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి చీర, కానుకలు సమర్పించారు. అర్చకులు, ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. దర్శనానంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
అందరినీ దుర్గమ్మ చల్లగా చూడాలి అని పూజలు చేశామన్నారు. భక్తులు నవరాత్రులు ఎంతో నిష్ఠతో పూజలు చేసి కానుకలు సమర్పిస్తారని.. అందరినీ దుర్గమ్మ కరుణించాలి అని చెప్పారు. నాడు తెలుగు దేశం ప్రభుత్వ హాయాంలో ఇంద్రకీలాద్రి పై ఎన్నో అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. 150 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసినట్లు వివరించారు. ఆ అభివృద్ధి పనులను కొనసాగించాలని అన్నారు.
దసరా రోజు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందన్న చంద్రబాబు.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక మీడియా అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. దుర్గమ్మ సాక్షిగా నాడు రాజధానిగా అమరావతిని సంకల్పించామని.. అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి అందరినీ భాగస్వాములను చేసి నిర్మాణం ప్రారంభించామన్నారు.
నాడు అన్ని రాజకీయ పార్టీలు రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపాయని తెలిపారు చంద్రబాబు. వైసీపీ వాళ్ళు కూడా తాము ఇక్కడే ఇళ్ళు కట్టుకున్నాము.. ఇదే రాజధాని అని నాడు చెప్పలేదా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై రోజుకోమాట మాట్లాడడం మంచిది కాదని.. అలాంటి వాళ్ళను దుర్గమ్మ తల్లి సహించదని అన్నారు. ఇక కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించమని అడగగా… ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయారు చంద్రబాబు.