టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనగానే మనందరికీ చాలా సాదాసీదాగా ఉండే ఆయన రూపం గుర్తుకు వస్తుంది. ఏనాడు కూడా ఆయన చేతికి వాచీ గానీ, వేళ్లకు ఉంగరాలు కానీ చూసింది లేదు. ఎప్పుడూ ఒకటే రకం దుస్తులు వేసుకుంటారు.అలాంటిది తాజాగా ఆయన చేతికి ఓ ప్లాటినం ఉంగరం కనిపిస్తోంది. దాని గురించి అందరూ తెగ ఆరాలు తీస్తున్నారు.. ఇంతకీ ఆ ఉంగరం కథ ఏంటంటే..?
అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లెలో జరిగిన టీడీపీ మినీ మహానాడుకు హాజరైన సందర్భంగా చంద్రబాబు చూపుడు వేలికి ప్లాటినం ఉంగరం కనిపించింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనగా… సమావేశం తర్వాత జరిగిన సమీక్షలో పార్టీ నేతల ఆసక్తి మేరకు చంద్రబాబు ఆ ఉంగరం ప్రత్యేకతలను వివరించారు.
తన వేలికి ప్లాటినం ఉంగరం కొత్తగా చేరిన మాట నిజమేనని చంద్రబాబు అన్నారు.. అది కేవలం ఉంగరం మాత్రమే కాదని, అది తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేసే పరికరమని చెప్పారు. ప్లాటినం ఉంగరంలో ఓ చిప్ ఉందని… అది తన హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం.. తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందని చెప్పారు. ఆ వివరాలను ప్లాటినం ఉంగరం ఎప్పటికప్పుడు తన కంప్యూటర్కు పంపుతుందని కూడా చంద్రబాబు తెలిపారు.
రోజూ నిద్ర లేచిన వెంటనే కంప్యూటర్లో ప్లాటినం ఉంగరం పంపిన రిపోర్ట్ చెక్ చేసుకుంటానని, రోజువారీగా జరగాల్సిన చర్యల్లో ఏది తప్పుగా ఉందన్న విషయాన్ని అది ఇట్టే చెప్పేస్తుందని ఆయన వెల్లడించారు. ఆ నివేదికను చెక్ చేసుకుని నిన్న ఏం తప్పు చేశామన్న విషయాన్ని గుర్తించి… అది మరలా పునరావృతం కాకుండా చూసుకుంటూ తన ఆరోగ్యాన్నికాపాడుకుంటానని ఆయన తెలిపారు.
పనిలో పనిగా టీడీపీ కార్యకర్తలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. టీడీపీ కార్యకర్తలంటే తనకు కుటుంబ సభ్యులతో సమానమని చెప్పిన చంద్రబాబు… తన మాదిరే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.