గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు వరద బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీ పర్యటన ముగించుకున్న ఆయన తెలంగాణలోకి ప్రవేశించారు. తెలంగాణ సరిహద్దు వద్ద చంద్రబాబుకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బూర్గంపాడు, సారపాకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆయన పరామర్శించారు.
గోదావరి వరదలతో సర్వం కోల్పొయి కష్టాల్లో ఉన్న వరద బాధితులను ప్రభుత్వాలే అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
’20 ఏళ్ల క్రితం గోదావరి కరకట్ట నిర్మించాం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పనులు చేశాం. 1986లోనూ వరదలు వస్తే భద్రాచలం ముంపునకు గురైంది. మనం చేసిన అభివృద్ధి శాశ్వతంగా ఉంటుంది. భవిష్యత్తులో విపత్తు లేకుండా పనులు చేపట్టాల్సి ఉంది. కరకట్ట నిర్మించి శాశ్వత పరిష్కారం జరిగే వరకు పోరాడతామని ఆయన అన్నారు.
అంతకు ముందు చంద్రబాబు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు… ఉపాలయంలో వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం, శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ రామయ్యను దర్శించుకున్నారు.
యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణలోనూ తెలుగుదేశం ఉండాల్సిన అవసరముందన్నారు. ఖమ్మంతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందన్న బాబు… తెదేపాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోటని గుర్తుచేశారు. ఇక్కడి వారిని చూస్తుంటే తెలంగాణతో పాత అనుభవాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. దూరదృష్టితో 2000 సంవత్సరంలో తెదేపా సర్కార్ భద్రాచలంలో చేపట్టిన కరకట్టల నిర్మాణం… ఇప్పుడు అందరినీ కాపాడిందని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి వరదలొచ్చినప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సుదీర్ఘ కాలం తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చంద్రబాబు రావడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.