ఆర్ఆర్ఆర్ సినిమా హద్దులు దాటేసి అందులోని నాటు నాటు సాంగ్ ఖండాంతరాలు చేరి ఆస్కార్ వేదికపై ప్రపంచ అత్యున్నత సినీ అవార్డు ఆస్కార్ ని పట్టుకొచ్చింది. ఈ పాట రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ వేదికపై ఈ అవార్డుని గర్వంగా అందుకున్నారు. రాజమౌళి ఎంతో కష్టపడి సినిమాని, పాటని అన్ని దేశాల్లో, ముఖ్యంగా హాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేశాడు.
ఆస్కార్ అందుకొని భారతదేశ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాడు రాజమౌళి అండ్ టీం. ఇక ఆస్కార్ అందుకున్న తర్వాత రాజమౌళి అండ్ టీం ఒక్కొక్కరు ఇండియాకు తిరిగి రాగా ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రపంచమంతా వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా నాటు నాటు పాట రాసిన చంద్రబోస్ అమెరికా నుండి శుక్రవారం ఉదయం తెల్లవారు జామున ఇండియాకు తిరిగివచ్చారు.
తెల్లవారు జామున 3 గంటలకు చంద్రబోస్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాగా అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆయనకు పూల దండాలు వేసి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అక్కడే ఎయిర్ పోర్ట్ లో చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. మన తెలుగు పాట ఇన్నేళ్ల చరిత్రలో ఆస్కార్ వరకు వెళ్లి ఆస్కార్ సాధించడం నిజంగా ఓ వరం, నాకు గర్వకారణం. నేను స్టేజి మీద కూడా తెలుగు మాట నమస్తే అని ఒక్కటే చెప్పాను. మన తెలుగు పాట అందరికి చేరువైంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.