ఓ వ్యక్తి చాలా ఏళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు అతడి కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చనిపోయాడని నిర్ధారించుకున్నారు. అంతేకాదు, కర్మకాండలు కూడా జరిపించారు. అయితే, అతడు చనిపోలేదని ఇన్నాళ్లు పాకిస్థాన్ జైల్లో ఉన్నాడని తెలిసింది. చనిపోయాడనుకున్న కుటుంబ సభ్యుడు తిరిగి ఇంటికి చేరుకుంటున్నాడని తెలిసి ఆ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. త్వరలోనే ఇంటికి రాబోతున్న అతడి కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తోంది. అయితే, తప్పిపోయిన వ్యక్తి భార్యకు ఇక భర్తలేడు కదా అని మరో వ్యక్తితో పెళ్లి చేశారు.
బిహార్ రాష్ట్రం బక్సర్ జిల్లాకు చెందిన ఛవీ ముషార్ అనే వ్యక్తి 12 సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో చనిపోయాడనుకుని కుటుంబసభ్యులు కార్మకాండలు కూడా నిర్మహించారు. అయితే, ఛవీ ముషార్ అప్పుడు దారితప్పి పాకిస్థాన్ సరిహద్దులోకి వెళ్లిపోయాడు. దీంతో పాక్ అధికారులు అతడిని పట్టుకుని కరాచీ జైల్లో పెట్టారు. ఇన్నాళ్లు అదే జైల్లో కాలం గడిపాడు.
అయితే, గతేడాది డిసెంబర్లో ఛవీ గురించి భారత విదేశాంగ శాఖకు సమాచారం అందింది. దీంతో వెంటనే స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించింది. చనిపోయాడని అనుకున్న వ్యక్తి తిరిగి రావటంతో ఆ కుటుంబసభ్యులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఎప్పుడెప్పుడు తమ బిడ్డను చూస్తానా అని ఆసక్తిగా ఛవీ ముషార్ తల్లి ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఛవీ ముషార్.. పాకిస్థాన్ జైలు నుంచి విడుదలై పంజాబ్లోని గురుదాస్పుర్ సరిహద్దులో ఉన్నాడు. అతనిని తీసుకురావడానికి బక్సార్ పోలీసు బృందం గురుదాస్పుర్కు వెళ్లింది.
కాగా, ఛవీ ముషార్ తప్పిపోయినప్పటికే ఆయనకు బిందు అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే, ఛవీ చనిపోయాడని ఆయన భార్య వేరొకరిని పెళ్లి చేసుకొని అత్త వారింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం వీరి బిడ్డను ఛవీ ముషార్ సోదరుడు పెంచుతున్నాడు.