టీటీడీలో వంశపారంపర్యంగా వస్తున్న అర్చక వృత్తిని యాధాతథంగా కొనసాగించేలా నిర్ణయం తీసుకున్న జగన్ ను టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు పొగడ్తలతో ముంచెత్తారు. వేల సంవత్సరాల నుంచి వంశ పారంపర్య అర్చకత్వం కొనసాగుతోందని, ఇటీవల ఏర్పడ్డ అడ్డంకులను జగన్ పునరుద్ధరించినందుకు టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పాలకుడిలో కూడా విష్ణు అంశ ఉంటుందని.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్కు సూచించారు. సనాతన దర్మానికి ఆటంకం కలిగినప్పుడు జగన్ విష్ణుమూర్తిలా ధర్మాన్ని పునరుద్ధరించారని కొనియాడారు.
మిరాశీ హక్కుల కోసం చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు సౌందర్యరాజన్ కూడా పోరాడారని రమణ దీక్షితులు గుర్తుచేశారు. మిరాశీ హక్కు రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ. రాజులు ఎన్నో భూములు, ఆభరణాలు సమర్పించుకున్నారని.. అర్చకులు ఆకలితో బాధపడకూడదని భూములు కేటాయించారని.. దీన్ని రాజకీయం చేయడం తగదన్నారు. చెట్టుకు పండ్లు ఉన్నపుడు రాతి దెబ్బలు సహజమని, టీటీడీపై ఆరోపణలు కూడా అలాంటివే అన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగదనీ.. వైఎస్ఆర్ హయాంలో కూడా కొందరు ఇలానే దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు.