షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రధాన సాక్షి ప్రభాకర్ సెయిల్ (37) మృతి చెందాడు. ఈ కేసులో స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్.. ముహల్ ప్రాంతంలోని తాను అద్దెకుంటున్న అపార్ట్ మెంట్ లో గుండెపోటుతో మృతిచెందినట్టు ఆయన తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు.
మృతి చెందిన సమయంలో ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నాడని.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు తుషార్. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో ఉన్న సోదరులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా.. ఈ కేసులో మరో సాక్షి అయిన కేపీ గోసావికి ప్రభాకర్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. కాగా.. ఈ కేసులో అక్టోబర్ లో అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. మూడు వారాల తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.
ప్రభాకర్ మృతి పట్ల కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును విచారిస్తున్నట్టు తెలిపారు. అయితే.. ఆర్యన్ ఖాన్ కేసు విచారణలో ఉన్న సమయంలోనే ప్రభాకర్ మృతి చెందడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.