సాధారణంగా ఎవరైనా కనిపించకపోయినా లేక కొందరు ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా.. అందుబాటులో లేకపోయినా పోస్టర్లు వేసి ప్రజలు నిరసన తెలుపుతుంటారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం కూడా విన్నాం. అయితే ఇక్కడ కూడా ఇంచు మించు అలాంటి ఘటనే . కానీ కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలా కూడా చేయవచ్చా అని అనిపిస్తుంది. ఇంతకీ ఆ ఘటన ఏంటని అనుకుంటున్నారా..!
చిట్టీల వ్యాపారి కోసం జగిత్యాల జిల్లాలో ఏకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో అదిరిపోయే ఆఫర్లు కూడా పెట్టారు బాధితులు. మాయమాటలు చెప్పి.. అందిన కాడికీ దండుకుని కుచ్చుటోపీ పెట్టిన సదరు కంత్రీగాడి ఆచూకీ చెబితే రూ.3 లక్షల నగదు బహుమతి ఇస్తామని బాధితులు ప్రకటించారు. అలాగే ఫ్లెక్సీల కింద ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఎవరికైనా చిట్టీల వ్యాపారి కనిపిస్తే వెంటనే తమకు ఫోన్ చేయాలని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. జగిత్యాల జిల్లా గోవిందుపల్లె చౌరస్తాకు చెందిన గాండ్ల వెంకన్న అనే వ్యక్తి గత కొన్నేండ్లుగా చిట్టీల వ్యాపారం చేసేవాడు. కొన్నాళ్లు ఈ వ్యాపారం బాగానే నడిపించాడు. అందరితో నమ్మకంగా మెలిగాడు. దీంతో చాలా మంది వెంకన్న వద్ద చిట్టీలు వేశారు.
ఇదే అదునుగా భావించిన వెంకన్న అందినకాడికి దండుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. కొన్ని రోజుల నుంచి అతను కనిపించకపోవడంతో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ఆవేదనను ఇలా తెలియజేస్తున్నారు.