తన పై ఆఫీసర్ కు ప్రతిరోజు సెల్యూట్ చేయటం పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరికీ అలవాటే. కానీ తిరుపతిలో పనిచేసే సీఐ శ్యామ్ సుందర్ కు ఈసారి సెల్యూట్ చేయటం స్పెషల్. ఎందుకంటే తను ఎంతో ముద్దుల కూతురు ఎదరుగా తనకన్నా పెద్ద హోదాలో వస్తుండటం. ఆ తండ్రి బాధ్యతగా సెల్యూట్ చేస్తూ ఆనందపడగా… ఎదురుగా ఉన్న ఆ అధికారి సంతోషంతో మురిసిపోతున్న సన్నివేశం అందర్నీ కట్టిపడేసింది.
2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. తిరుపతిలో ఏపీ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా పోలీస్ డ్యూటీ మీట్- ఇగ్నైట్ నిర్వహిస్తుంది. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో దిశ విభాగం లో ప్రశాంతి ఐపీఎస్ భాద్యతలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు శామ్ సుందర్.
ఇక్కడే ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు, తను కూడా వెంటనే సెల్యూట్ చేసి ఏంటి నాన్నా…అంటూ గట్టిగా నవ్వేశారు. తన బిడ్డ పెద్ద హోదాలో పోలీసు శాఖలో పనిచేయాలని కలలు కన్నానని, ఇప్పుడు నిజం అయ్యిందంటూ సీఐ మురిసిపోయారు.
పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి… ఇలాంటి సన్నివేశం సహజంగా సినిమాలో చూస్తుంటాం, తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫాం ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతం గా చాలా ఘర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి అంటూ అభినందించారు.