ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఈ నెల 11న జరుగుతుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత మాత్రం రాలేదు. తేదీ ఖరారు కాకున్నా.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అయితే ఖాయమే అనే గుసగసలు వినిపిస్తున్నాయి.
కొత్త కేబినెట్ ఎలా ఉంటుందన్న దానిపై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఎలా ఉంటుందన్న దానిపై వివరణ ఇచ్చారు.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. కేబినెట్ లో మెజార్టీ మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు.
సోషల్ జస్టిస్ కు అనుగుణంగా సీఎం జగన్ కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేస్తున్నారంటూ సజ్జల చెప్పుకొచ్చారు. మొత్తంగా సామాజిక సమీకరణాలే ప్రామాణికంగా సాగనున్న జగన్ కేబినెట్ విస్తరణలో బడుగులకు పెద్ద పీట వేసేదిగా ఉంటుందని వార్తలొస్తున్నాయి.