హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ)లో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. వర్సిటీ విద్యార్థి సంఘాల ఎలక్షన్స్ హింసాత్మకంగా మారాయి. ఎన్నికల విషయంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువైపుల వారు దాడికి దిగారు. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
వర్సిటీ క్యాంపస్ డోర్లు, అద్దాలు ధ్వంసమైన దృశ్యాలను చూస్తే గొడవ పెద్దదిగానే కనిపిస్తోంది. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్ ల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి సంబంధించి ఎస్ఎఫ్ఐ వర్గంపై ఏబీవీపీ ఆరోపణలు గుప్పించింది.
తమ గ్రూపులోని గిరిజన విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ వర్గీయులు దాడి చేసి కొట్టినట్టు ఆరోపించింది. పదునైన ఆయుధాలతో దాడి చేసినట్టు పేర్కొంది. ఏబీవీపీ పోస్టర్లను చింపి వేస్తుండగా ప్రశ్నించిన విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు దాడిచేసినట్టు చెబుతున్నారు.
శుక్రవారం రాత్రి ఎలక్షన్ ముగిసిన తర్వాత ఒంటిగంటకి కేరళకి చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఏబీవీపీ పోస్టర్లును చింపి వేశాడు. దీనిపై ప్రశ్నించిన వారిపై ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ దాడికి పాల్పడ్డారని తెలిపారు. కాగా, ఈ ఏడాది విద్యార్థి సంఘాల ఎన్నికలను యూనివర్సిటీ నిర్వహిస్తోంది.