సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ క్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వప్నలోక్ అగ్ని ప్రమాదంపై స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్న ఆయన స్వప్నలోక్ కాంప్లెక్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగార్జున నటించిన సూపర్ డూపర్ హిట్ ‘శివ’ సినిమా క్లైమాక్స్ ను స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే చిత్రీకరించినట్టు గుర్తు చేశారు.
సినిమా ఎండింగ్ లో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీక్వెన్స్ ను అక్కడే షూట్ చేసినట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు వర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.
ఈ ప్రమాదంలో కాల్ సెంటర్ లో పనిచేసే నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందారు. అందరి వయసూ 22 ఏళ్లే. పొగతో ఊపిరాడక వీరంతా ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరగ్గానే చాలా మంది ఎలాగోలా బయటపడి తప్పించుకున్నారు. వీరు మాత్రం ఓ గదిలోకి వెళ్లి తల దాచుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత పెరగడంతో గదిలోకి దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడక స్పృహ కోల్పోయారు.
This sequence in SHIVA was shot on top of Swapna lok complex which caught fire last nite https://t.co/TcaM5YQWS8
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2023