భట్టి విక్రమార్క సీఎల్పీ నేత
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన అనేక సబ్సిడీలను కోత పెట్టి.. రైతుబంధు పేరుతో కేసీఆర్ అన్నదాతలను మోసం చేస్తున్నారు. రైతు బంధు పేరుమీద ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయాన్ని, సబ్సిడీనికి కేసీఆర్ ప్రభుత్వం ఆపేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు ప్రజలకు, రైతులుకు అర్థమవుతోంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేవలం భూమిదున్నని భూస్వాములకు, వందల ఎకరాల బీడుభూమి ఉన్న ఆసాములకు మాత్రమే రైతు బంధు ఉపయోగపడుతోంది తప్ప.. నిజంగా భూమిని దున్నే రైతులకు ఉపయోగపడడం లేదు.
భూమిని నమ్మి పంట పండించే రైతులకు మద్దతు ధరలేక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు.. అంతేకాక గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు లేక… అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మొదలు పెట్టిన సదర్మఠ్ ప్రాజెక్టుకు కుట్రతోనే డిజైన్ మార్చి.. ఈ ప్రాంతవాసులకు నీళ్లు రాకుండా చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కోసం నిర్మించిన కడెం ప్రాజెక్టు ద్వారా చివరి భూములకు నీళ్లు అందించేలా గత ప్రభుత్వాలు ప్రతి ఏడాది మెయింటెనెన్స్ చేయడం జరిగేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మెయిటెనెన్స్ చేయక పోవడంతో..కింది ప్రాంత రైతులకు నీళ్లు రావడం లేదు. కడెం ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం మంజూరు చేసిన 130 మంది ఉద్యోగులను గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమిస్తే.. కేసీఆర్ ప్రభుత్వం101 మందిని తొలగించి.. కేవలం 29 మందితో ప్రాజెక్టు నిర్వహణ చేస్తోంది. కడెం ప్రాజెక్టును రైతులకు దూరం చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. ధరణితో రైతులందరినీ కేసీఆర్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టారు. ధరణి అనేది సంస్కరణ కాదు.. సంక్షోభం.
రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాల్లోపు ఉన్నవారే.. వారంతా పండించిన పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎలా అమ్ముకుంటారు ? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ సెంటర్లు కొనసాగించాలి. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు.. దేశ రైతాంగాన్ని వణికిస్తున్నాయి.