బీఏసీ నిర్ణయాలను సీఎం కేసీఆర్ సభ ముందు ఉంచారు. ఈనెల 6న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. 8న బడ్జెట్ పై సాధారణ చర్చ.. వాటిపై ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు. ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.
9,10,11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ.. 12 న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరగనున్నట్లు కేసీఆర్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.అంతకు ముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసన సభ,శాసన మండలిలో చర్చ జరుగుతోంది.
రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా చర్చల్లోకి వెళ్లారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో శాసనసభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు.
మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు. ఆ తర్వాత అన్ని పక్షాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు. మరో వైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పై ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.