ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా జీఐఎస్ ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమ్మిట్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైజాగ్ లో జీఐఎస్ జరగడం గర్వంగా ఉందన్నారు. ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
రాష్ట్రంలో 340 మందిపెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు సీఎం. శుక్రవారం 92 ఎంవోయూలు జరుగుతాయన్నారు. వీటి ద్వారా 4 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయన్నారు. మిగిలిన ఎంవోయూలు శనివారం జరుగుతాయని చెప్పారు. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవు అని వెల్లడించారు.
వైజాగ్ ను చిన్న ఎకనామిక్ హబ్ గా అభివర్ణించారు. సెప్టెంబర్ లో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ కు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సిటీ వైజాగ్ అంటూ ఆహ్వానించారు సీఎం జగన్. భారతదేశంలో అతి కీలకమైన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని అన్నారు. ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలమన్నారు.
ఆంధ్రాలో సులువైన పారిశ్రామిక విధానం ఉందన్నారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములు ఉన్నాయని చెప్పారు. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్ ఉంటే.. అందులో 3 ఏపీలోనే ఉన్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు ఏపీ నెంబర్ వన్ గా ఉందని గుర్తు చేశారు. ఇక త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటీవ్ రాజధానిగా అవుతుందన్నారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్.