డైవర్ట్ పాలిటిక్స్ కు ముఖ్యమంత్రి జగన్ మళ్లీ తెర తీశారని మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్ హంతకులను కాపాడేందుకు.. విశాఖ రాజధాని అంటూ.. సుప్రీం కోర్టులో ఉన్న విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చి డైవర్ట్ పాలిటిక్స్ కు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ రెడ్డికి బాబాయ్ హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద.. రాష్ట్ర ప్రజలపై లేదని అన్నారు.
బాబాయ్ హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచగానే జగన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారా? అని నిలదీశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు.
లిక్కర్ స్కామ్ లో భార్య పేరు బయటకు రాగానే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు తెరపైకి తీసుకువచ్చి ఆ విషయాన్ని కూడా డైవర్ట్ చేశారన్నారు. రాజధానికి ౩౦ వేలు ఎకరాలు కావాలన్నావు, ఇల్లు ఇక్కడే కట్టాను అన్నావు, ఇప్పుడు రాజధాని విశాఖ అంటున్నావు ఇది మోసం కదా జగన్ రెడ్డి.. అని ఆయన ప్రశ్నించారు.
జగన్ ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే చూస్తున్నారన్నారు. తమ ప్రాణాలను అడ్డువేసైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని, ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధిచెబుతామని పేర్కొన్నారు కొల్లు రవీంద్ర.