చిరు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం రుణాలను అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ఒక్కో వ్యాపారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల వడ్డీ లేని రుణాన్ని జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల కష్టాలను దగ్గర నుంచి చూసి, వారి కష్టాలను తీర్చేందుకే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. జగనన్న తోడు పథకం ద్వారా 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.395 కోట్ల రుణాలు అందించామన్నారు.
చిరు వ్యాపారులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వడ్డీ, గ్యారెంటీ లేకుండా రుణం అందిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఈ రుణాలకు సంబంధించి చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని, ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తుందని వెల్లడించారు.
ఇప్పటివరకు 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు జగన్ తెలిపారు. గత 6 నెలల వ్యవధిలో ఈ పథకం కింద ఇచ్చిన రుణాలకు సంబంధించి వడ్డీ రూ.15.17 కోట్లను రీయింబర్స్ మెంట్ చేశామన్నారు. ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
ఈ పథకానికి సంబంధించి రుణాలను సకాలంలో చెల్లించిన 13.28 లక్షల మందికి రూ.63 కోట్లకు పైగా వడ్డీ తిరిగి చెల్లించామన్నారు. ఈ పథకం చిరు వ్యాపారులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. జగనన్న తోడు పథకం అందని చిరువ్యాపారులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు సీఎం జగన్.